నా గొంతు ఆగాలంటే నన్ను ఎన్‌కౌంటర్‌ చేయండి : కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

 

నెల్లూరు :

అనుమానించిన చోట ఉండకూడదని భావించి నీతిగా, నిజాయతీగా తన అధికారాన్ని వదులుకున్నానని వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అన్నారు. ఆఖరి దాకా ఉండి నామినేషన్లకు ముందు రోజు మోసం చేస్తే తప్పని, కానీ తాను అలా చేయలేదన్నారు. ఇటీవల ఫోన్‌ ట్యాపింగ్‌ జరిగిందంటూ కోటంరెడ్డి చేసిన ఆరోపణలపై వైసీపీ నేతలు విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కోటంరెడ్డి మళ్లీ మీడియా ముందుకు వచ్చారు. నెల్లూరులో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడారు.

‘‘అధికార పార్టీకి దూరం అవుతున్నానంటే ఎన్ని ఇబ్బందులు వస్తాయో నాకు తెలుసు. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తిని కాదు. విద్యార్థి నేతగా మొదలు 35 ఏళ్లుగా జిల్లా రాజకీయాల్లో ఉన్నవాడిని. నా మనసు విరిగింది. ప్రాణాతిప్రాణంగా ఆరాధించిన జగన్‌ ప్రభుత్వంలో నా ఫోన్‌ ట్యాపింగ్‌కు గురైందని ఆధారాలు చూపించి బయటకు వచ్చా. ఆఖరిదాకా ఉండి మోసం చేయలేదు. నెల ముందు వరకు నాకు ఎలాంటి ఆలోచనలు లేవు. ఫోన్‌ ట్యాపింగ్‌పై ఆధారం దొరికాక దూరం జరిగా.

దాదాపు 10 మంది మంత్రులు, రీజినల్‌ కోఆర్డినేటర్లు, సలహాదారులు నాపై ఎలా మాట్లాడారో అందరికీ తెలుసు. ఆ తర్వాత సమాధానం చెప్పాలనే ఉద్దేశంంతోనే నా వద్ద ఉన్న ఆధారం బయటపెట్టా. ట్యాపింగ్‌పై విచారణ జరపండి అని కోరా. అధికార పార్టీ ఎమ్మెల్యే ఆరోపణలు చేస్తున్నందున రాష్ట్ర ప్రభుత్వమే కేంద్ర హోంశాఖకు లేఖ రాసి ఉంటే పారదర్శకత ప్రజలకు అర్థమయ్యేది.. ప్రజలు ఆమోదించేవారు. అధికార పార్టీ ఎమ్మెల్యేపై ఫోన్‌ ట్యాపింగ్‌ ఆషామాషీగా జరగదు.కోటంరెడ్డి అరెస్టుకు రంగం సిద్ధమని లీకులు ఇస్తున్నారు. నన్ను ఏ నిమిషమైనా అరెస్టు చేసుకోండి. శాశ్వతంగా జైల్లో పెట్టండి. కేసులు పెట్టి మీరు అలసిపోవాలే తప్ప.. నా గొంతు ఆగే ప్రశ్నే లేదు. నా గొంతు ఆగాలంటే ఒక్కటే పరిష్కారం.. ఎన్‌కౌంటర్‌ చేయించండి. అప్పుడే నా గొంతు ఆగుతుంది. ఎవరు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారో ఎన్నికల వేళ తెలుస్తుంది’’ ’’ అని కోటంరెడ్డి అన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest