తెలుగు భాష వర్ధిల్లాలి : నందిని సిద్ధారెడ్డి

 

హైదరాబాద్ :

తెలుగు నేలపై తెలుగు వర్ధిల్లాలని ప్రముఖ రచయిత, నంది అవార్డు గ్రహీత, తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి చైర్మన్ నందిని సిద్ధారెడ్డి అన్నారు. తెలుగు నాడు సమితి ఆధ్వర్యంలో కుషాయిగూడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని జరిగిన కార్యక్రమంలో నందిని సిద్ధారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు నేలపై ఉన్న ప్రతి ఒక్కరు తెలుగు నేర్చుకోవాలని తెలుగులోనే మాట్లాడాలని తద్వారా తెలుగు వర్ధిల్లాలని ఆయన కోరారు. విద్యార్థులు రేపు ప్రభుత్వం ఉద్యోగాలు రావాలన్నా, ఉన్నత స్థానాలకు ఎదగాలంటే తెలుగు భాష ఖచ్చితంగా వచ్చి తీరాలని ఆయన సూచించారు. ఇటీవల పబ్లిక్ సర్వీస్ కమిషన్ జరిపిన ఇంటర్వ్యూలలో కొద్దిమంది అభ్యర్థులు తెలుగు వార్తాపత్రిక చదవటం కూడా రానివారు వచ్చారని వారిని చూస్తే తనకు ఆశ్చర్యం వేసిందని అన్నారు. తెలుగు భాషని సంపూర్ణంగా నేర్చుకుంటే తనకు వచ్చినట్టుగానే అవార్డులు, రివార్డులు, గౌరవ మర్యాదలు దక్కుతాయని తెలిపారు. మన మాతృభాష అయినటువంటి తెలుగుని మర్చిపోవద్దని, కొత్త విషయాలు ఎన్ని నేర్చుకున్న పాత విషయాలు మర్చిపోవద్దు అని విద్యార్థులకు సూచించారు. ఇటువంటి భాషా దినోత్సవాలు తరచుగా పాఠశాలలో జరపాలని ఆయన కోరారు. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు రంగారెడ్డి మాట్లాడుతూ అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం యొక్క ప్రాధాన్యతను వివరించారు. తెలుగునాడు సమితి అధ్యక్షులు గుమ్మడి హరిప్రసాద్ మాట్లాడుతూ తెలుగు వికాసానికి, తెలుగు భాష పరిరక్షణకు 2003 సంవత్సరం నుండి తెలుగునాడు సమితి ఎంతో కృషి చేస్తుందని వివరించారు. ధరణి దినపత్రిక సంపాదకులు జి రోజా రాణి విద్యార్థులకు మాతృభాష ప్రాధాన్యతను తెలిపారు. అంతర్జాతీయ మాతృభాష దినోత్సవ సందర్భంగా విద్యార్థులకు జరిపిన వ్యాసరచన, ఉపన్యాస పోటీలలో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు బహుమతులు, ప్రశంసా పత్రాలు నందిని సిద్ధారెడ్డి చేతుల మీదుగా అందించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలుగు ఉపాధ్యాయులను తెలుగునాడు సమితి వారు సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల తెలుగు ఉపాధ్యాయులు లక్ష్మణ్, లచ్చిరామ్, రజిత, నిర్మలా శ్రీ, జ్యోతి, శ్రీనివాస్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest