2047 నాటికి భారత్ అగ్రగామి దేశంగా అవతరిస్తుంది:కేంద్ర మంత్రి భగవంత్ ఖుబా

హైదరాబాద్

నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (నైపర్) హైదరాబాద్ పదో స్నాతకోత్సవం క్యాంపస్ లోని ఆడిటోరియంలో జరిగింది. కేంద్ర రసాయనాలు, ఎరువులు, నూతన, పునరుత్పాదక ఇంధన శాఖ సహాయ మంత్రి  భగవంత్ ఖుబా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించిన కేంద్ర మంత్రి  భగవంత్ ఖుబా గత కొన్ని సంవత్సరాలుగా భారతీయ ఫార్మాస్యూటికల్ రంగం సాధించిన విజయాలు, కోవిడ్ -19 మహమ్మారి సమయంలో భారతీయ ఫార్మాస్యూటికల్ రంగం పోషించిన పాత్ర వివరించారు. నిజ జీవిత అవసరాలను తీర్చడానికి పరిశోధన ఫలితాలు ఉపయోగపడాలని అన్నారు. ఉత్పత్తుల పారిశ్రామికీకరణ ప్రాధాన్యతను మంత్రి వివరించారు.

అమృత్ పాలనలో 2047 నాటికి భారతదేశ ఆర్థిక వ్యవస్థ 42 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి సాధించాలని లక్ష్యంగా నిర్ణయించుకుని ఈ దిశగా పని చేస్తున్నారని శ్రీ భగవంత్ ఖుబా అన్నారు. 2047 నాటికి భారత్ ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా నిలుస్తుందని అన్న ధీమాను మంత్రి వ్యక్తం చేశారు. విద్యార్థులను అభినందించిన కేంద్ర మంత్రి భారతదేశాన్ని ఒకప్పుడు బంగారు పక్షి అని పిలిచేవారని ఇప్పుడు అదే పక్షి విద్య, ఆధ్యాత్మిక, సంస్కృతి తదితర రంగాల్లో గతంలో మాదిరిగానే విశ్వ గురువుగా ప్రపంచాన్ని నడిపించేందుకు సిద్ధంగా ఉందన్నారు.

నైపర్ హైదరాబాద్ డైరెక్టర్ డాక్టర్ శశి బాలా సింగ్ స్వాగతం పలికారు. 16 ఏళ్ల స్వల్ప కాలంలోనే ఈ సంస్థ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ లో అడ్వాన్స్ డ్ స్టడీస్, లెర్నింగ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గా ఎదిగిందన్నారు. పరిశోధన, పారిశ్రామిక ప్రాజెక్టులు, విద్యార్థుల ప్రతిభ వంటి అన్ని అంశాల్లో సమగ్ర అభివృద్ధిని సాధించిన ఎన్ఐఆర్ఎఫ్ 2వ స్థానంలో నిలిచిందన్నారు.
విద్యార్థులను ఉద్దేశించి  లారస్ ల్యాబ్స్ లిమిటెడ్ ముఖ్య కార్యనిర్వహణాధికారి డాక్టర్ సత్యనారాయణ చావా మాట్లాడుతూ ప్రతిష్టాత్మక సంస్థ పెంపొందించిన మూల విలువలు గౌరవిస్తూ దేశాభివృద్ధిలో చురుగ్గా పాల్గొనాలని విద్యార్థులకు సలహా ఇచ్చారు. . గ్రాడ్యుయేట్లు సంస్థ ఖ్యాతిని ఇనుమడింప జేయాలని, భవిష్యత్ ప్రయత్నంలో విజయం సాధించాలని ఆకాంక్షించారు. స్నాతకోత్సవంలో మొత్తం 187 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేశారు. 25 మంది పీహెచ్ డీ, 162 మంది ఎంఎస్ (ఫార్మా), ఎంబీఏ (ఫార్మా) పట్టాలు స్వీకరించారు. యాదవ్ విశాల్ ఫయానాథ్ (ఎంసీ), అంకితా సాహెబ్రావ్ ఖైర్నార్ (పీఏ), టెంటు ప్రియా మౌనిక (పీసీ), కే కావ్య ప్రహర్ష (ఆర్టీ), రిమ్షా నూరీన్ (పీఈ), గిరాసే ప్రదీప్ నానాభావు (పీటీపీసీ), డోనా మోల్ సన్నీ (పీఎం), గుండేల్లి పనీషా (ఎండీ)లు బంగారు పతకాలు సాధించారు. . 2020-22 బ్యాచ్ కి గాను సఫియా సుల్తానాకు ఉత్తమ ఆల్ రౌండర్ స్టూడెంట్ గా డైరెక్టర్ మెడల్ లభించింది.

నైపర్-హైదరాబాద్ చైర్మన్, బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ సభ్యులు, పరిశ్రమకు చెందిన పలువురు సభ్యులు, అన్ని నైపర్ సంస్థల డైరెక్టర్లు , నైపర్-హైదరాబాద్ విద్యార్థులు, వారి కుటుంబ సభ్యులు, పూర్వ విద్యార్థులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest